ముంబై, జూన్ 13 : దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ముంబై వర్లీలోని భిమాండి టవర్స్లోని 32వ అంతస్తులో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో భవనంలోని పై రెండు అంతస్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ భవనంలోనే కేంద్రమంత్రి పీయూష్ గోయల్, బాలీవుడ్ నటి దీపికా పదుకొణె సహా పలువురు సెలబ్రిటీలు, ప్రముఖుల నివాసాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్చలు ప్రారంభించారు. బిల్డింగ్లో ఉన్న 95 మందిని కాపాడామని, మంటలనార్పడానికి 8 ఫైర్ ఇంజన్లు పనిచేస్తున్నాయని అధికారులు వెల్లడించారు. అయితే ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనా స్థలికి చేరుకున్నప్పటికీ 33వ అంతస్తులో వ్యాపించిన మంటలు ఆర్పేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో పక్కనే ఉన్న మరో టవర్పైకి చేరుకొని మంటల్ని పూర్తిగా అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గాలులు వీస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. మంటలు మరింత వ్యాపించే అవకాశం ఉండటంతో అవసరమైతే హెలీకాఫ్టర్ ద్వారా సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్టు సమాచారం లేదు.