హైదరాబాద్, జూన్ 12 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ద్వారా భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టిన విషయం తెలిసిందే. కాగా ఈ ఉద్యోగ నియామక ప్రక్రియలో సాంకేతిక సమస్యలు అభ్యర్థుల వెంటాడుతున్నాయి. వీఆర్వో, గ్రూపు-4 ఉద్యోగాల కోసం ఆన్లైన్ ఫీజు చెల్లింపుల్లో.. మూడు రోజులుగా అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. అభ్యర్థుల ఖాతాల్లో నగదు బదిలీ అయినప్పటికి ఫీజు చెల్లించినట్టు టీఎస్పీఎస్సీ నుంచి నిర్దారణ రావడం లేదు. కొందరైతే ఏకంగా రెండు మూడు సార్లు ఫీజు చెల్లించారు. కొందరు ఎన్నిసార్లు యత్నించినా ఫీజు చెల్లింపులో అవరోధాలు ఏర్పడుతున్నాయి. వివిధ వర్గాల నుంచి వెల్లువెత్తిన ఫిర్యాదుల మేరకు సాంకేతిక సమస్యను సరిదిద్దినట్లు టీఎస్పీఎస్సీ పేర్కొంది. రెండు సార్లు అభ్యర్థులు చెల్లించిన ఫీజును వారి ఖాతాల్లోనే జమచేస్తామని వెల్లడించింది.