హైదరాబాద్, జూన్ 10 : బాలీవుడ్ లో ప్రస్తుతం రణ్బీర్ కపూర్, అలియా భట్ల మధ్య ప్రేమాయణం హాట్ టాఫిక్గా మారింది. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ చాలాసార్లు కెమెరాకు చిక్కారు. దీంతో అందరి అనుమానాలకు ఊతం ఇచ్చినట్లైంది. అంతేకాదు రణ్బీర్ కపూర్ వీరి బంధాన్ని అంగీకరించిన సంగతి తెలిసిందే. తాము రిలేషన్షిప్లో ఉన్నాం.. ఇప్పుడు ఈ విషయం గురించి ఎక్కువగా మాట్లాడాలనుకోవడం లేదని తెలిపారు. అలియా మాత్రం తన బిగ్గెస్ట్ క్రష్ రణ్బీర్ అని చెప్పినప్పటికీ... తమ బంధం గురించి మాత్రం ఎటువంటి కామెంట్లు చేయలేదు. అయితే రణ్బీర్ తల్లి నీతూ కపూర్, సోదరి రిదిమాలతో అలియాకు సత్సబంధాలే ఉన్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా అలియా రణబీర్ కుటుంబంతో కలసి డిన్నర్కు వెళ్లిందట. వీరిద్దరితో పాటు నీతూ కపూర్, రిదిమా, సమర కూడా ఉన్నారు. ముంబైలోని సెయింట్ రెగిస్ హోటల్లో వీరు డిన్నర్కు హాజరైన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దీంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్ళిపీటలెక్కనున్నట్లు వార్తలు సాగుతున్నాయి.