చెన్నై, జూన్ 10 : వెండితెరలపై వెలుగొందుతున్న స్టార్ హీరోలు బుల్లితెరపై కూడా రాణిస్తున్నారు. బిగ్ బాస్ షో తో పలువురు సెలబ్రిటీలు ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఓ పక్క తెలుగులో నాని, మరోపక్క తమిళంలో కమల్హాసన్ షోకు సంబంధించిన విషయాలను వెల్లడిస్తూ ప్రేక్షకులను ఊరిస్తున్నారు. అయితే తమిళ బిగ్బాస్ షోలో ప్రముఖ నటి రాయ్ లక్ష్మి కూడా పాల్గొంటున్నారని కొంతకాలంగా వార్తలు వెలువడుతున్నాయి. అయితే తాను ఎలాంటి షోలల్లో పాల్గొనడం లేదని గతంలో ఆమె స్పష్టత ఇచ్చారు. అయినప్పటికీ బిగ్బాస్ ప్రోమోల్లో కమల్ ఫొటో పక్కన రాయ్లక్ష్మి ఫొటోలు వేస్తుండడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఒకే విషయం చెప్పి చెప్పి విసుగొస్తోంది. నేను తమిళ బిగ్బాస్లో పాల్గొనడం లేదు. అయినా కూడా ఛానెల్కు చెందిన కొందరు వ్యక్తులు నా పేరు వాడి అమాయకులను ఫూల్ చేస్తున్నారు" అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోపక్క తెలుగు బిగ్బాస్లో నటి శ్రీరెడ్డి పాల్గొంటున్నట్లు కూడా సోషల్మీడియాలో. కానీ అందులో ఎలాంటి నిజం లేదని శ్రీరెడ్డి సోషల్మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. వంద రోజుల పాటు సాగే తెలుగు బిగ్బాస్ కార్యక్రమానికి నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు నుంచి షో ప్రసారం కానుంది. మరోపక్క తమిళంలో కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. జూన్ 17 నుంచి ఈ షో ప్రారంభం కానున్నట్లు సమాచారం.