మోదీ హత్యకు కుట్ర...!

SMTV Desk 2018-06-08 18:30:55  PM Modi Assassination, modi Assassination, suspected Maoist, pm modi

న్యూఢిల్లీ, జూన్ 8 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందా..? అంటే ఔను అనే సమాధానం వస్తుంది. భీమా-కొరెగావ్ హింస కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు సమర్పించిన ఓ లేఖను పరిశీలిస్తే మోదీ హత్యకు కుట్ర జరుగుతోందని అనిపిస్తుంది. ఈ కేసులో ఐదుగురు నిందితులను పుణే పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి ఓ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయస్థానానికి తెలిపారు. ప్రధాని మోదీ నిర్వహించే రోడ్ షోలను లక్ష్యంగా చేసుకుని, రాజీవ్ గాంధీని హత్య చేసినట్లుగా, అదే తరహాలో మోదీని హత్య చేసేందుకు కుట్ర జరుగుతున్నట్లు ఈ లేఖలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి మహారాష్ట్రలోని భీమా కోరేగాంలో జరిగిన హింసాత్మక ఘటనకు సంబంధించి కేసులో సుధీర్‌ దావలే, సురేంద్ర గాట్లింగ్‌, సోమా సేన్‌, మహేష్‌ రౌత్‌, రోనా జాకబ్‌ విల్సన్‌ అనే ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే జాకబ్‌ విల్సన్‌ను అరెస్ట్‌ చేసిన ఇంటినుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న లేఖ తాజాగా కలకలం రేపుతోంది. మోదీని ఎలా హత్య చేయాలో మావోయిస్టులు లేఖల ద్వారా చర్చించుకోవడం లేఖలో స్పష్టంగా ఉంది. జాతీయ వార్తా ప్రసార మాధ్యమాలు వెల్లడించిన వివరాల ప్రకారం మోదీ పరిపాలనను అంతం చేసేందుకు కచ్చితమైన చర్యలను కొందరు యాక్టివిస్ట్‌లు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. రాజీవ్ గాంధీ హత్య తరహాలో తాము ఆలోచిస్తున్నట్లు, ఇది ఆత్మహత్యా సదృశమని , దీని అమలులో విఫలమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ పార్టీ పీబీ/సీసీ తమ ప్రతిపాదనపై తప్పనిసరిగా ఆలోచించాలని కోరినట్లు తెలుస్తోంది. మోదీ రోడ్ షోలను లక్ష్యంగా చేసుకోవడం సమగ్రమైన వ్యూహం కాగలదని కూడా పేర్కొన్నట్లు సమాచారం. ఈ ప్రకటనపై భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీ అనుమానాలు వ్యక్తం చేసింది. ప్రజాదరణ తగ్గుతోందన్న ఆందోళనలో భాగంగానే మోదీ ఈ హత్య నాటకానికి తెరలేరపారని ఆరోపించింది. ఇలాంటి అవాస్తవాలు చెప్పి ప్రజలను మోసం చేయలేరని పేర్కొంది. మోదీకి ఇలాంటి నాటకాలు కొత్తకాదని చెప్పింది. గుజరాత్‌కు ముఖ్యమంత్రిగా పని చేసిన కాలంలో కూడా ఇలానే ఆయన రాజకీయవ్యూహాలు వేశారని ధ్వజమెత్తారు.