న్యూఢిల్లీ, జూలై 12 : ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి ఈకే పళనిస్వామి నేతృత్వంలోని ప్రభుత్వం ఫిబ్రవరి 18న రాష్ట్ర శాసనసభలో విశ్వాస పరీక్షలు సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా, సుప్రీంకోర్టు ధర్మాసనం చట్టసభలో స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై న్యాయసమీక్ష చేయవచ్చా అన్న విషయాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. అన్నాడీఎంకే ఎమ్మెల్యే కే పాండ్యరాజన్ దాఖలు చేసిన వ్యాజ్యంపై న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. స్పీకర్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది న్యాయ సమీక్షకు లోబడి ఉండాల్సిందేనా అని ధర్మాసనం ప్రశ్నించగా, పిటిషనర్ పాండ్యరాజన్ మాజీ సీఎం పన్నీర్ సెల్వం సన్నిహితుడు ఫిబ్రవరి 18 నాటి విశ్వాసపరీక్ష చెల్లదని ప్రకటించాలని కోరుతూ వ్యాజ్యం దాఖలు చేశారు. కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ వాదనలు వినిపిస్తూ ఈ కేసులో రాతపూర్వక విజ్ఞప్తి చేయడానికి తమకు గడువు ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ పిటిషనర్ తరపున సీనియర్ అడ్వొకేట్ గోపాల్ సుబ్రమణ్యం వాదనలు వినిపించారు. ధర్మాసనం తదుపరి విచారణను ఆగష్టు 9కి వాయిదా వేసినట్లు సమచారం.