ముంబై, జూన్ 7 : టీమిండియా సారథి విరాట్ కోహ్లికు ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కింది. 2016-17, 2017-18 సీజన్లలో విశేష ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు బీసీసీఐ అవార్డులను ప్రకటించింది. ఈ క్రమంలో ఉత్తమ అంతర్జాతీయ ఆటగాడికి ఇచ్చే పాలి ఉమ్రీగర్ అవార్డును విరాట్ కోహ్లీ దక్కించుకున్నట్లు బీసీసీఐ అధికారులు వెల్లడించారు. ఈ అవార్డు కింద కోహ్లీ రూ.30 లక్షలు (ఏడాదికి రూ.15 లక్షల చొప్పున) అందుకోనున్నాడు. దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్లో విశేష ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు వయస్సుతో సంబంధం లేకుండా అవార్డులకు ఎంపిక చేసినట్లు వారు చెప్పారు. జూన్ 12న బెంగళూరులో ఈ అవార్డుల ప్రదానోత్సం కార్యక్రమం జరగనుంది. 2016-17, 2017-18 సీజన్లలో మహిళల క్రికెట్లో బాగా రాణించినందుకుగాను హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంధానకు బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ అవార్డును అందజేయనున్నారు. వీరిద్దరు కూడా తలో రూ.15 లక్షల చెక్ను అందుకోనున్నారు. అవార్డులు దక్కించుకున్న మరికొంత మంది ఆటగాళ్ల వివరాలు చూద్దాం. 2016-17 సీజన్ : >> కృనాల్ పాండ్య- లాలా అమర్నాథ్ అవార్డు(దేశవాళీ క్రికెట్లో ఆల్రౌండర్గా రాణించినందుకు) >> పర్వీజ్ రసూల్(జమ్ము& కశ్మీర్) - లాలా అమర్నాథ్ అవార్డు(రంజీ ట్రోఫీలో ఆల్రౌండర్గా రాణించినందుకు) >> ఠాకూర్ తిలక్ (హైదరాబాద్) - జగన్మోహన్ దాల్మియా ట్రోఫీ (అండర్-16 విజయ్ మర్చంట్ టోర్నీలో అత్యధిక స్కోరు) >> పూనమ్ రౌత్ - జగన్మోహన్ దాల్మియా ట్రోఫీ 2017-18 సీజన్ : >> మయాంక్ అగర్వాల్ - మాధవరావు సింథియా అవార్డు (రంజీ ట్రోఫీలో అత్యధిక స్కోరు) >> ఆర్యమన్ బిర్లా(కుమార మంగళం బిర్లా తనయుడు) - ఎమ్ఎ చిదంబరం ట్రోఫీ >> కె. నితీశ్ కుమార్ రెడ్డి (ఆంధ్రప్రదేశ్) - జగన్మోహన్ దాల్మియా ట్రోఫీ