ఢిల్లీ, జూన్ 6 : వ్యాపారానికి నిధులు, ధైర్యం, ప్రజలతో మమేకమయ్యే తీరు స్టార్టప్లలో రాణించేందుకు దోహదపడుతాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా యువ వ్యాపారవేత్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. స్టార్టప్లు పెద్ద పెద్ద నగరాలకే పరిమితం కాదని, దేశమంతటా విస్తరిస్తున్నాయని మోదీ చెప్పారు. మేకిన్ ఇండియా, డిజిల్ ఇండియా కూడా స్టార్టప్లకు ముఖ్యమేనని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.."ఒకప్పుడు స్టార్టప్ కంపెనీలు అంటే డిజిటల్, టెక్నాలజీకి సంబంధించినవే ఉండేవి. కానీ ఇప్పుడు అది మారుతోంది. వ్యవసాయం దగ్గర్నుంచి అన్ని రంగాల్లోనూ స్టార్టప్లు వస్తున్నాయి. యువత వ్యాపారాల్లోకి వచ్చేందుకు ప్రభుత్వం అని విధాలా సహాయం చేస్తోంది. నిబంధనలను కూడా సరళించి స్టార్టప్లకు నిధులు అందిస్తున్నాం. నేటి పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ ఒకప్పుడు స్టార్టప్లే. అందుకే నేను కోరుతున్నది ఒకటే. భారత ప్రజలు ఎప్పుడూ సృజనాత్మకంగా ఉండాలి" అని మోదీ అన్నారు.