న్యూఢిల్లీ, జూన్ 6 : బృందాలుగా కలిసి విహారయాత్రలకు, తీర్థ యాత్రలకు వెళ్లాలనుకునే వారికి ఐఆర్సీటీసీ సువర్ణ అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం ఐఆర్సీటీసీ(ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్) సరికొత్త సన్నాహాలు చేస్తోంది. కేవలం దేశీయ యాత్రలే కాకుండా విదేశీ యాత్రలకు కు సైతం క్షేమంగా చేరుస్తామంటూ పేర్కొంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక రైలు కూడా సిద్దం చేస్తామంటోంది. అసలు ఎన్ని గంటలు, ఎంత సమయం అని ఆలోచిస్తున్నారా..? అలాంటి సందేహాలు మాని కేవలం మీకున్న సమయం.. మీకున్న సెలవులు.. ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నారో తెలిపితే చాలు.. అందుకు తగినవిధంగా పర్యటనను తామే సిద్దం చేస్తామంటూ వివరిస్తోంది. అంతేకాదు పర్యటనకు వెళ్ళాలనుకునే వారి కోరిక మేరకు కొన్ని కొత్త ప్యాకేజీలను సిద్దం చేసి.. ఐఆర్సీటీసీ నిర్వహిస్తున్న పర్యాటక ప్రాంత వివరాలను సైతం అందజేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక మేనేజర్ ఉంటారు. ఆయన మీ యాత్రకు సంబంధించిన వివరాలను చూసుకుంటారు. ఎక్కడికి వెళ్ళాలి.. ఎలా వెళ్ళాలి.. అనే విషయాలతో పాటు బయలుదేరే నాటి నుండి బస, వసతి, సందర్శన స్థలాలు వంటి కనీస సౌకర్యాలను తిరిగి వచ్చేంతవరకు మేనేజర్ వెన్నంటే ఉంటారు. పలు పాఠశాలలను లక్ష్యంగా చేసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలకోసం ఐఆర్సీటీసీ వెబ్ సైట్.. www.irctctourism.com ను సందర్శించవచ్చు. ఐఆర్సీటీసీ ముఖ్యంగా.. తిరుపతి, షిరిడి, వారణాసి, విశాఖపట్నం, పాపికొండలు, రాజమంది, రామేశ్వరం, కన్యాకుమారి, మధురై, జైపూర్, ఆగ్రా, ఢిల్లీ గోల్డెన్ ట్రయాంగిల్ టూర్, జమ్మూ, శ్రీనగర్, హరిద్వార్, రిషికేశ్, హిమాచల్ టూర్.. సిమ్లా, కులు మనాలి, జోధ్పూర్, జై సల్మేర్.. ఇలా ఉత్తర, దక్షిణ భారత సందర్శకులకు ఈ యాత్రలను నిర్వహిస్తోంది.