విపక్షాల ఎఫెక్ట్ : దిగొచ్చిన మోదీ, షా ద్వయం..

SMTV Desk 2018-06-05 16:19:28  pm modi, amith shah, l.k.adwani, murali manohar joshi, bjp

న్యూఢిల్లీ, జూన్ 5 : కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీకి ఉపఎన్నికల్లో మాత్రం ఎదురుదెబ్బే తగిలింది. విపక్షాల ఐక్యత దెబ్బకు కషాయిదళం కంగుతింది. దీంతో అప్రమత్తమైన బీజేపీ దూరమవుతున్న మిత్రులను మళ్లీ దగ్గరకి తెచ్చుకొనే ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో బుధవారం ముంబైలో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రేను షా కలవబోతున్నారు. తాజాగా పార్టీలోని సీనియర్లను కూడా మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు బెంగాల్‌కు చెందిన ఆనంద్‌బజార్ పత్రిక ఓ కథనం వెల్లడించింది. దీని ప్రకారం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీలోని కురు వృద్ధులు ఎల్‌కే అద్వానీతోపాటు మురళీమనోహర్ జోషిలకు మరోసారి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని మోదీ భావిస్తున్నారు. నిజానికి అమిత్ షా పెట్టిన కొత్త రూల్ ప్రకారం 75 ఏళ్లు మించిన వాళ్లను పార్టీలో పక్కన పెట్టేస్తున్నారు. కానీ ఇప్పుడు వరుసగా తగులుతున్న షాక్‌లు ఈ నిబంధనపై మరోసారి ఆలోచించేలా చేస్తున్నాయి. వయసుది ఏముంది గెలిచేవాళ్లు కావాలి అని మోదీ, షా ఆలోచిస్తున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో అద్వానీ గాంధీనగర్ స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికైనా.. ఆ తర్వాత పార్టీలో ఆయనను పూర్తిగా పక్కనపెట్టేశారు. అటు జోషికి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. దీంతో ఈ ఇద్దరు సీనియర్లు ఏదో పార్టీలో అలా ఉన్నారంతే. పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకొనే పార్లమెంటరీ బోర్డు నుంచి కూడా అద్వానీ, జోషిలను అమిత్ షా తప్పించారు. మార్గదర్శక మండలి పేరుతో ఓ ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసి అందులో వీళ్లకు అవకాశం ఇచ్చినా.. ఇప్పటివరకు అది ఒక్కసారీ సమావేశమైంది లేదు. పార్టీలోని సీనియర్లతో మోదీ, షా వ్యవహరిస్తున్న తీరుపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఏది ఏమైనా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల దృష్ట్యా మోదీ. అమిత్ షా ద్వయం సీనియర్ల ఆహ్వానిస్తూ మళ్లీ పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నారు.