న్యూఢిల్లీ, జూన్ 4: ఐపీఎల్-11 సీజన్ లో కింగ్స్ X1 పంజాబ్ ప్రారంభంలో ఐదు మ్యాచ్ లు గెలిచి మంచి జోరు మీద కనిపించింది. కానీ ద్వీతీయార్ధంలో వరుస పరాజయాలతో లీగ్ దశలోనే ఇంటి బాట పట్టింది. అయితే ఆ జట్టు సమిష్ఠ కృషి ఎలా ఉన్న.. మెంటార్ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడిని స్వేచ్ఛగా ఆడేలా ప్రోత్సహించాడని కేఎల్ రాహుల్ చెప్పాడు. "టోర్నీలో భాగంగా నేను సెహ్వాగ్తో చాలాసార్లు మాట్లాడాను. అతను ఆటను ఎంతో సులభంగా మార్చేవాడు. మిగతా ఆటగాళ్లను కూడా అదేవిధంగా ఆడాలంటూ సలహాలు ఇచ్చేవాడు. మన ఆత్మస్థైర్యాన్ని నమ్ముకొని బరిలోకి దిగాలని, చిరునవ్వుతో ఆటను ఆస్వాదిస్తూ ముందుకు సాగాలని సూచించాడు. ఈ స్వేచ్ఛ కేవలం నాకు మాత్రమే కాదు. జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడికి ఇస్తుండేవాడు. మేము స్వేచ్ఛగా ఆడామంటే.. అందుకు సెహ్వాగే కారణం " అని రాహుల్ వ్యాఖ్యానించాడు.