ముంబై, జూన్ 3 : ప్రముఖ బాలీవుడ్ నటి బిపాసా బసు అస్వస్థతకు లోనయ్యారు. కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆమెను శనివారం ముంబయిలోని ఓ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. కొన్ని రోజుల నుంచి బిపాసా ఈ సమస్యతోనే పలుమార్లు ఆస్పత్రికి వెళ్లారని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. సమస్య తీవ్రతరం కావడంతో కొన్ని రోజులు ఆస్పత్రిలోనే చికిత్స తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ముంబయికి చెందిన ప్రముఖ పల్మనాలజిస్ట్ బిపాసాకు చికిత్స చేస్తున్నారు. అయితే ఈ విషయం గురించి బిపాసా కుటుంబీకులు ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వడంలేదు. చివరిగా ‘ఎలోన్’ చిత్రంలో ఆమె ప్రేక్షకులకు కనిపించారు. ఇందులో బిపాసాకు జోడీగా కరణ్ సింగ్ గ్రోవర్ నటించారు. ఈ సినిమా సమయంలోనే ఇద్దరూ ప్రేమించుకుని వివాహ బంధంతో ఒకటయ్యారు. త్వరలో వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటించబోతున్నారు.