భువనేశ్వర్, జూన్ 2 : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి బీజేపీ కూడా అభ్యర్థిని బరిలోకి దించుతుందని ఆ పార్టీ సీనియర్ నేత ధర్మేంద్రప్రధాన్ వెల్లడించారు. ప్రస్తుత డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్నారు. వచ్చే వర్షాకాల సమావేశాల్లో ఈ ఎన్నిక జరుగనుంది. కాగా ఆ పదవి కోసం ముఖ్యంగా బీజేడీ నేత ప్రసన్న ఆచార్య, తృణమూల్ నేత సుఖేందు శేఖర్ ఉన్నట్లు మీడియా వర్గాల సమాచారం. కమలం పార్టీని దూరంగా ఉంచేందుకు బీజేడీ అభ్యర్థికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయన్న వార్తలు వస్తున్నాయి. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా ఎన్నికయ్యేందుకు 122 సభ్యుల మద్దతు కావాల్సి ఉంటుంది. రాజ్యసభలో బీజేపీకి 67 మంది సభ్యులు, కాంగ్రెస్కు 51 మంది, బీజేడీకి 9 మంది సభ్యుల బలముంది. "బీజేపీ తరఫున అభ్యర్థిని పోటీలో ఉంచుతాం. ముందుగా ఏకాభిప్రాయానికి ప్రయత్నిస్తాం.అవసరమైతే కాంగ్రెస్ మద్దతు తీసుకుంటాం" అని ధర్మేంద్రప్రధాన్ వెల్లడించారు.