హైదరాబాద్, జూన్ 2 : యువ హీరో బెల్లకొండ సాయి శ్రీనివాస్ హీరోగా మంచి జోరు మీద ఉన్నాడు. ‘జయ జానకి నాయక’ సినిమాతో మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస్.. ఇప్పుడు వరసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే ‘సాక్ష్యం’ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా అంచనాలు భారీగానే ఉన్నాయి. తాజాగా ఈ బడా నిర్మాత కుమారుడు మరో సినిమాలో నటిస్తున్నాడు. వంశధార క్రియేషన్స్ పతాకంపై నవీన్ సొంటినేని (నాని) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కాజల్ కథానాయక. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన శ్రీనివాస్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. హీరోయిన్గా ఎంపికైన కాజల్ అగర్వాల్ తాజాగా షూటింగ్లో పాల్గొంది. ప్రస్తుతం హైదరాబాద్లో వేసిన ప్రత్యేక సెట్లో బెల్లకొండ శ్రీనివాస్, కాజల్పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. "కథలో కథానాయిక పాత్రకు చాలా కీలకమైనది. అందుకే కాజల్ని తీసుకున్నాం. ఇదో యాక్షన్ థ్రిల్లర్. త్వరలోనే టైటిల్ను ప్రకటిస్తాం. ఇప్పటికే హిందీ శాటిలైట్ హక్కులు రూ.9.5 కోట్లకు అమ్ముడయ్యాయి. ఓ యంగ్ హీరో చిత్రానికి ఈ స్థాయిలో రేటు పలకడం సంతోషంగా ఉంది" అన్నారు. హర్షవర్ధన్ రాణే, సత్యం రాజేష్, కళ్యాణి నటరాజన్, అపూర్వ, పోసాని కృష్ణమురళి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. భారీ తారాగణంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.