ఢిల్లీ, జూన్ 1 : ప్రభుత్వ సేవల కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ఈ సమస్యను తీర్చడానికి ఢిల్లీ సర్కారు ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత దగ్గర చేసే దిశగా కసరత్తులు చేస్తుంది. వివాహ, కుల, ఆదాయ, నివాస, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, కొత్త నీటి కనెక్షన్లు, డ్రైవింగ్ లైసెన్స్లు, వయో వృద్ధుల పెన్షన్ పథకం తదితర దాదాపు 40 ప్రభుత్వ సేవలను ఇంటి దగ్గరికి తీసుకొచ్చేందుకు అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ విధానాన్ని అమలు పరిచేందుకు ప్రభుత్వం ప్రైవేటు ఏజెన్సీ సహాయం తీసుకుంటోంది. ఈ ఏడాది జులై చివరి నాటికి ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆప్ ప్రభుత్వం తెలిపింది . ఈ సర్వీసు అందుబాటులోకి వస్తే దాదాపు ఎనిమిది ప్రభుత్వ విభాగాల నుంచి నలభై ప్రభుత్వ సర్వీసులను ప్రజలు తమ ఇంటి వద్ద నుంచే పొందవచ్చని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఈ విధానం వల్ల ప్రజల సమయం వృథా కాదని, అంతేకాకుండా ప్రభుత్వ సేవల్లో పారదర్శకత పెరుగుతుందని అన్నారు.