విజయవాడ, జూన్ 1: బెజవాడ దుర్గగుడిలో చెలరేగిన వివాదంకు ఫుల్ స్టాప్ పడింది. క్షురుకుల ఆందోళన విషయం తెలుసుకున్న పాలకమండలి ఛైర్మన్ గౌరంగాబు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలు రంగంలోకి దిగారు. దుర్గగుడి కేశఖండన శాలలో భక్తుడి నుంచి రూ.10లు తీసుకున్న క్షురకుడిని పాలకమండలి సభ్యుడు పెంచలయ్య మందలించి చొక్కా పట్టుకున్నారు. దీనిపై ఆగ్రహించిన క్షురకులు విధులు బహిష్కరించి కేశఖండన శాల వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో అమ్మవారికి తలనీలాలు ఇచ్చేందుకు వచ్చిన భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్ గౌరంగబాబు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న క్షురకులతో ఈ విషయంపై చర్చించారు. వారి కోరిక మేరకు పాలకమండలి సభ్యుడు పెంచలయ్య క్షురకులకు క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఇదే సందర్భంలో క్షురకులు తమ సమస్యల్ని ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లగా త్వరలోనే పరిష్కరిస్తామని గౌరంగబాబు హామీ ఇచ్చారు.