హైదరాబాద్, జూలై 10 : తెలంగాణలో అంగరంగా వైభవంగా బోనాల పండుగ వేడుకలు జరుగుతున్నాయి. ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాలు మొదలయ్యాయి. ప్రతి ఏడులాగే ఈ సంవత్సరం కూడా పచ్చికుండపై నిలబడి, అమ్మవారిని ఆవహించుకుని స్వర్ణలత భవిష్యవాణి వినిపించింది. "వర్షాలు సకాలంలో సమృద్ధిగా కురుస్తాయి. పాడిపంటలతో రాష్ట్రం విలసిల్లుతుంది. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉంటారు. భక్తులకు ఎలాంటి ఆపద రానివ్వను. తెలంగాణ కోట్లకు పడగలెత్తుతుంది. సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉంటారు’’ అని స్వర్ణలత భవిష్యవాణి చెప్పింది. ఆదివారం కేసీఆర్ భార్య కల్వకుంట్ల శోభ, మంత్రి పద్మారావు భార్య స్వరూపతో కలిసి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి పద్మారావు ఇంటినుంచి నిజామాబాద్ ఎంపీ కవిత బోనమెత్తుకుని ఆలయానికి చేరుకున్నారు. ఈ మేరకు అమ్మవారికి బోనం సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ భవిష్యవాణి వినేందుకు భక్తులు భారీ ఎత్తున తరలి వచ్చారు.