పాట్నా, మే 27 : బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లూలా ప్రసాద్ యాదవ్ కోడలు , తేజ్ ప్రతాప్ యాదవ్ భార్య ఐశ్వర్యరాయ్ రాజకీయాల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. లాలూ కోడలు ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా బిహార్ ప్రజలు కోరుకుంటున్నట్లు ఆర్జేడీ నేత రాహుల్ తివారీ మీడియా ద్వారా తెలిపారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో బిహార్లోని చాప్రా నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం. అయితే దీనిపై లాలూ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని.. ఆయన సమ్మతిస్తే ఛాప్రాలో ఐశ్వర్య గెలవడం ఖాయమని తివారీ అన్నారు. మే12న లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్కు బిహార్ మాజీ ముఖ్యమంత్రి డరోగా ప్రసాద్ రాయ్ మనవరాలు ఐశ్వర్య రాయ్కు వివాహం జరిగింది. దాంతో పార్టీకి సంబంధించిన పలు బాధ్యతలను ఐశ్వర్యకు కూడా కేటాయించాలని లాలూ కుటుంబం ఆలోచనలో ఉందంట. ఇది ఇంకా ఫైనల్ కానే లేదు. కానీ అప్పుడే అధికార జేడీయూ ఆ పార్టీపై విమర్శలు చేస్తుంది. ఆర్జేడీ కార్యకర్తలు డ్రమ్స్ వాయించడానికే ఉంటారని, పార్టీ టికెట్లన్నీ లాలూ కుటుంబ సభ్యులకే వస్తాయని జేడీయూ నేత నీరజ్ కుమార్ అన్నారు. ఇప్పటికే లాలూతోపాటు ఆయన భార్య రబ్రీదేవి కూడా బీహార్ సీఎంగా పనిచేసిన విషయం తెలిసిందే. లాలూ ఇద్దరు తనయులు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు.