హైదరాబాద్, మే 24 : బాలీవుడ్ నటులు రణ్బీర్ కపూర్, ఆలియా భట్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో రణ్బీర్ కపూర్ లాంటి అబ్బాయిని చేసుకుంటా అని ఆలియా చెప్పడం వారి ప్రేమకు ఆజ్యం పోసినట్లై౦ది. తాజాగా వీరిద్దరూ జంటగా "బ్రహ్మాస్త్రా" చిత్రంలో నటిస్తున్నారు. దీంతో పలు పార్టీలకు, ఫంక్షన్ లకు వీరు చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. వీరి ప్రేమ గురించి మీడియా ప్రశ్నించగా.. సినిమా ప్రచారం కోసం కలిసి తిరుగుతున్నామని.. మా మధ్య అలాంటిదేం లేదని కొట్టిపారేశారు. రణ్బీర్ కపూర్ తండ్రి రిషి కపూర్ పెట్టిన ట్వీట్ చూస్తే ఇద్దరికీ పెళ్లి కుదిరిందా.? అనే అనుమానం కలుగక మానదు. ఇంతకీ ఆయన చేసిన ట్వీట్ ఏంటంటే.. "భట్ కుటుంబం(బంధువులు)లో మహేశ్ భట్, ముఖేశ్ భట్, రాబిన్ భట్, పూర్ణిమ, సోనీ భట్, పూజా భట్, ఇమ్రాన్ హష్మీ, ఆలియా భట్లతో కలిసి పనిచేశాను. అందరికీ ధన్యవాదాలు" అని ట్వీట్ చేశారు. పైగా వారిని బంధువులు అని సంభోది౦చడంతో ఇరు కుటుంబాలు వియ్యంకులు కావడానికి సిద్దమయ్యారని బాలీవుడ్ లో వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే.