చెన్నై, మే 23 : తమిళనాడులోని తూత్తుకుడిలో విద్వంసంనకు కారణమైన స్టెరిలైట్ విస్తరణ పనులను నిలిపివేయాలని మద్రాస్ హైకోర్టు బుధవారం స్టే విధించింది. తూత్తుకుడిలో ప్రాంతంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగిన తర్వాతే స్టెరిలైట్ విస్తరణకు సంబంధించిన పర్యావరణ అనుమతులు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేసింది. నాలుగు నెలల్లోపు ఈ ప్రజాభిప్రాయ సేకరణను జరగాలని తన ఆదేశాల్లో పేర్కొంది. ఇప్పటికి ఏటా 4,00,000 టన్నుల రాగిని ఉత్పత్తి చేసే కర్మాగారాన్ని ఇక్కడ స్టెరిలైట్ నిర్వహిస్తోంది. దాదాపు మరో రూ.3,000 కోట్లు వెచ్చించి ఇక్కడే మరో రాగి ప్లాంట్ నిర్మాణం చేపట్టింది. ఇప్పటికే కాలుష్యం కారణంగా ఇబ్బందులు పడుతున్న స్థానికులు పరిశ్రమ విస్తరణను వ్యతిరేకిస్తూ మంగళవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో దాదాపు 11 మంది ప్రాణాలు కోల్పోయారు. స్టెరిలైట్ నేపథ్యం.. >> ప్రస్తుతం తూత్తుకుడిలో ఏర్పాటు చేసిన స్టెర్లైట్ రాగి ఉత్పత్తి కర్మాగారాన్ని మొదట మహారాష్ట్రలోని రత్నగిరిలో ఏర్పాటు చేయాలని వేదాంత గ్రూప్ భావించింది. 1992లో రత్నగిరి జిల్లాలో 500 ఎకరాలను కేటాయిస్తూ నాటి మహారాష్ట్ర పరిశ్రమల అభివృద్ది సంస్థ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కానీ, స్థానికుల ఆందోళనతో 1993లో కర్మాగార నిర్మాణాన్ని నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. >> రత్నగిరిలో రద్దైన ప్రాజెక్టును తమిళనాడుకు తరలించాలని వేదాంత నిర్ణయించింది. దీంతో తమిళనాడు ప్రభుత్వం హడావుడిగా అనుమతులు జారీ చేసింది. 1996 లో ఈ కంపెనీ ఆరంభమైంది. ఇక అక్కడి నుండి అ కంపెనీ పరిసర ప్రాంతాల ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. >> స్టెర్లైట్ నుంచి వెలువడే రసాయిన వాయువుల కారణంగా చుట్టుపక్కల చిన్నచిన్న పరిశ్రమల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు ఆరోగ్య సమస్యలు రావడం మొదలైంది. కానీ, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి స్టెర్లైట్ను వెనకేసుకొచ్చి క్లీన్ చీట్ ఇచ్చింది. >> 2001లో భారీ వర్షాల కారణంగా తూత్తుకుడిలో చుట్టుపక్కల చెరువుల్లోకి విషజలాలు వచ్చి చేరుతున్నట్లు స్థానికులు ఫిర్యాదు చేశారు. 2013లో తూత్తకుడిలో భారీగా విషవాయువులు విడుదలయ్యి ప్రజలు తీవ్ర అవస్థపడ్డారు. ఇంతా ప్రమాదకరమైన ఈ సంస్థను స్థానిక ప్రజలు ప్రమాదకరమని, తక్షణమే మూసేసే దిశగా ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నారు. అయినా లాభం లేకుండా పోయింది.