హైదరాబాద్, మే 23 : ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా పాత్ర చాలా కీలకంగా మారింది. ఎటువంటి విషయమైనా క్షణాల్లో ప్రజలకు చేరువైపోతుంది. కాని ఇక్కడే ఓ చిక్కు వచ్చి పడింది. అసలు అందులోని విషయం నిజమా..? కాదా..? అని తేల్చుకోవడమే పెద్ద ప్రశ్నగా మారింది. తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు అగ్ర కథానాయికగా ఒక వెలుగు వెలిగిన నటి రాధికపై ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆమె క్యాన్సర్ తో బాధపడుతున్నారని ప్రచారం జరిగింది. ఈ విషయం తెలిసిన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే వరుస ట్వీట్స్ చేస్తూ.. రాధికను ప్రశ్నించారు. దీనికి రాధిక స్పందించారు. "అలాంటి వార్తలను నమ్మకండి. అది నిజం కాదు" అంటూ ట్వీట్ చేశారు. దీంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం రాధిక తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తున్నారు.