విశాఖ, మే 23 : కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మిత్ర ధర్మానికి వెన్నుపోటు పొడిచారని ఏపీ మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. ఈ మేరకు విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించిన ధర్మపోరాట దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. ఏపీకి నమ్మకద్రోహం చేసిన బీజేపీకి మొన్న కర్ణాటక ఎన్నికలలో తెలుగు ప్రజలు ట్రైలర్ చూపించారని.. 2019 ఎన్నికల్లో పూర్తి సినిమా చూపించబోతున్నామని వ్యాఖ్యానించారు. గత నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నా విభజన హామీలను నెరవేర్చకపోవడంతో ఎన్డీయే నుండి టీడీపీ బయటకు వచ్చిందన్నారు. భాజపా ఎన్ని అవాంతరాలు సృష్టించినా, ఏమాత్రం సహాయం చేయకున్నా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. నిరుద్యోగులకు అతి త్వరలోనే భృతి కూడా అందనుంది. భాజపా, వైకాపాలు క్విడ్ ప్రో కో రాజకీయాలు చేస్తున్నాయి.