శ్రీకాకుళం, మే 22 : జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పర్యటనను శ్రీకాకుళం జిల్లా నుండి ప్రారంభించారు. శ్రీకాకుళం నుండి కాశీబుగ్గ వరకు జరిగిన కవాతులో పాల్గొన్న పవన్ కల్యాణ్.. అనంతరం కాశీబుగ్గ బస్టాండ్ వద్ద జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ఎక్కడైతే దోపిడీ రాజకీయ వ్యవస్థ ఉంటుందో అక్కడ కచ్చితంగా తిరుగుబాటు ఉంటుందన్నారు. తిరుగుబాటు చేసిన నేల మన శ్రీకాకుళమని.. ఈ నేల రక్తం చిందించడానికి కూడా వెనకాడదని అన్నారు. అలాంటి నేల నుంచి పోరాట యాత్ర చేపట్టిన తనకు అపూర్వ స్వాగతం పలికిన ప్రజలకు వందనమన్నారు. దశాబ్ద కాలంగా పాలకులు చేసిన తప్పులకు అమాయకులైన ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారని చెప్పారు. నేటి యువతరానికి ప్రభుత్వాలు కన్నీళ్లు, కష్టాలు, బాధలు తప్ప ఏమీ విడిచిపెట్టలేదన్నారు. ఈ అన్యాయాలకు కడుపుమండి ప్రజల ముందుకు వచ్చానన్నారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని జనసేనాని అన్నారు.