హైదరాబాద్, మే 20 : ఐపీఎల్-11 ప్లే ఆఫ్స్ ఉత్కంఠ ఈ రోజుతో ముగియనుంది. శనివారం సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది. పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో సన్ రైజర్స్ ఉండగా... రెండవ స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. ఇప్పుడు మూడో ప్లేస్ లోకి కేకేఆర్ జట్టు దూసుకొచ్చింది. మరి ఆ నాలగవ బెర్త్ ఎవరిదీ అనే విషయం ఈ రోజుతో తేలనుంది. ఈ రోజు సాయంత్రం ఢిల్లీతో ముంబయి, రాత్రి చెన్నైతో పంజాబ్ తలపడనున్నాయి. ముంబై గెలిస్తే... >> ముంబయి.. ఢిల్లీని ఓడిస్తే ఉత్కంఠకు ముగింపు పడ్డటే. అది ముంబయికి ఏడో విజయం అవుతుంది. రాత్రికి చెన్నైని పంజాబ్ ఓడించినా ఫలితం ఉండదు! అప్పుడు ముంబయి, రాజస్థాన్, పంజాబ్ ఏడేసి విజయాలతో సమమవుతాయి. >> కానీ నెట్రన్రేట్లో ముంబయి (0.384) చాలా ముందుంది. ముంబయి గెలవగానే ముందు రాజస్థాన్ (నెట్ రన్రేట్ -0.250) నిష్క్రమిస్తుంది. -0.490 నెట్రన్రేట్తో ఉన్న పంజాబ్ ఎంత భారీగా గెలిచినా ముంబయిని దాటడం కష్టం కాబట్టి ఆ జట్టూ వైదోలిగినట్లే. రోహిత్ సేన ముందుకెళ్లినట్లే. ముంబై ఓడిపోతే... >> ఒకవేళ ముంబయి సాయంత్రం ఓడిపోతే.. అప్పుడు రాజస్థాన్, పంజాబ్ మధ్య పోటీ నెలకొంటుంది. రాత్రికి పంజాబ్.. చెన్నైపై భారీ విజయం సాధించి నెట్రన్రేట్లో రాజస్థాన్ను అధిగమిస్తే ముందంజ వేస్తుంది. ఆ జట్టు ఎంత తేడాతో గెలవాలన్నది ముందే తేలిపోతుంది. ఒకవేళ పంజాబ్ గెలిచినా నెట్రన్రేట్లో అధిగమించలేకపోతే లేదా ఆ మ్యాచ్ ఓడితే రాజస్థాన్ ప్లే ఆఫ్ బెర్త్ ను దక్కించుకుంటుంది.