హైదరాబాద్, మే 16 : కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన "మహానటి" చిత్రం ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఆమె నటనకు ప్రేక్షకాభిమానులు ఫిదా అయిపోయారు. ప్రతి ఒక్కరు ఆమె నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో కీర్తికి ఆఫర్లు వరుస కట్టాయి. కాని ఇక్కడ విశేషమేమిటంటే.. కీర్తి బామ్మ సరోజకు కూడా సినిమాలో వరుసగా ఆఫర్లు వస్తుండడం విశేషం. స్వతహాగా కీర్తి బామ్మకు సినిమాలతో ఎటువంటి సంబంధం లేదు. కాని అప్పుడప్పుడూ కీర్తికి తోడుగా షూటింగ్లకు వెళ్తుండేవారు. "రెమో" షూటింగ్ సమయంలో సరోజను చూసిన శివకార్తికేయన్.. ఆమెను ఒక్క సీనులో నటింపజేశారు. దీంతో ఆమెకు సినిమాలో నటించాలన్న కోరిక కలిగింది. ఆ తర్వాత చారుహాసన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న "దాదా 87"లో సరోజను కీలకపాత్రకు ఎంపిక చేశారు. 87 ఏళ్ల వయసున్న దాదా పాత్ర పోషిస్తున్న చారుహాసన్కు భార్యగా నటింపజేసేందుకు 80 ఏళ్ల వయసున్న బామ్మలను అన్వేషిస్తుండగా, కీర్తిసురేష్ బామ్మ గురించి తెలిసింది. ఆమెకు కూడా నటనపై ఆసక్తి ఉండడంతో ఆ పాత్రలో నటింపజేశారు. ఎనబై సంవత్సరాల వయసులో ఆమెను వరుస అవకాశాలు వస్తుండడంతో ఆశ్చర్యపోవడం అందరి వంతైంది.