హైదరాబాద్, మే 11 : "మహానటి" తెలుగు రాష్ట్రాలలోనే కాదు విదేశాల్లో దూసుకుపోతోంది. మహానటి సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకులు, సినీ ప్రముఖుల నుండి ప్రశంసలు అందుతున్నాయి. ఈ చిత్రం అమెరికాలో మిలియన్ డాలర్ల క్లబ్లో అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. మరోపక్క ఈ చిత్రం యూకేలో 15 లొకేషన్లలో రూ.25.90 లక్షలు రాబట్టినట్లు సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తెలిపారు. న్యూజిలాండ్లో మూడు లొకేషన్లలో రూ.4.65 లక్షలు రాబట్టినట్లు పేర్కొన్నారు. నిజానికి ఈ రెండు దేశాల్లో భారత చిత్రాల సందడి చాలా తక్కువగా ఉంటుందని, కానీ ‘మహానటి’కి మంచి స్పందన లభించిందని చెప్పారు. ఆస్ట్రేలియాలో సినిమా మొత్తం రూ.64.03 లక్షలు వసూలు చేసినట్లు తరణ్ పేర్కొన్నారు. బుధవారం 31,500 డాలర్లు (ఆస్ట్రేలియన్), గురువారం 22,953 డాలర్లు, శుక్రవారం 31,070 డాలర్లు, శనివారం 40,377 డాలర్లు మొత్తం 125,900 డాలర్లు వసూలు చేసినట్లు ట్వీట్ చేశారు. అమెరికాలో సినిమా మిలియన్ డాలర్ల మార్కును దాటిందని చెప్పారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ నటించారు. ఆమె భర్తగా జెమిని గణేశన్గా దుల్కర్ సల్మాన్ కనిపించారు. సమంత, విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను వైజయంతి మూవీస్ సంస్థ నిర్మించింది.