న్యూఢిల్లీ, మే 13 : ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ కలిగిన క్రికెట్ లీగ్ అంటే... అందరికి గుర్తొచ్చేది ఐపీఎల్. ఇప్పుడు ఈ మెగా టోర్నీను మహిళా క్రికెటర్లకు ఐపీఎల్ నిర్వహించాలన్న ప్రతిపాదన దిశగా చిన్న అడుగు పడింది. బీసీసీఐ ఈ నెల 22న ముంబయిలో ఐపీఎల్ ప్లేఆఫ్కు ముందు ప్రయోగాత్మకంగా మహిళలకు ఎగ్జిబిషన్ టీ20 మ్యాచ్ను నిర్వహించనుంది . ఈ మ్యాచ్ కోసం 20 మంది భారత మహిళా క్రికెటర్లతో పాటు పది మంది విదేశీయులు కసరత్తులు చేయబోతున్నారు. వీరి నుంచి రెండు జట్లను తయారు చేస్తారు. ఒక జట్టు ఐపీఎల్ ఎలెవన్ కాగా.. మరొకటి బీసీసీఐ ఎలెవన్. ఐపీఎల్ తరహాలో ఒక్కో జట్టులో ఏడుగురు భారతీయులు, నలుగురు విదేశీయులు ఉంటారు. 22న మధ్యాహ్నం 2.30 నిమిషాలకు స్టార్ స్పోర్ట్స్ లో ప్రసారం కానుంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ బోర్డుల్ని సంప్రదించి ఈ మ్యాచ్లో పాల్గొనే విదేశీ క్రికెటర్ల పేర్లను బీసీసీఐ ప్రకటించనుంది. భారత అమ్మాయిల వివరాలను సెలక్షన్ కమిటీ విడుదల చేయనుంది.