అహ్మదాబాద్, మే 11 : గుజరాత్లో 2002వ సంవత్సరంలో అనంద్ జిల్లాలోని ఓడే పట్టణంలో జరిగిన అల్లర్లకు సంబంధించిన కేసులో 19 మందిని దోషులుగా నిర్ధారిస్తూ శుక్రవారం గుజరాత్ హైకోర్టు తీర్పునిచ్చింది. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో ఆనంద్ జిల్లాలోని ఒడేలో 23 మందిని అల్లరి మూకలు సజీవ దహనం చేశాయి. స్పెషల్ ట్రయల్ కోర్టు ఈ కేసులో మొత్తం 23 మందిని దోషులుగా గుర్తించింది. దోషులుగా తేలిన మొత్తం 14 మందికి కింది కోర్టు విధించిన జీవిత ఖైదును సమర్ధించింది. మరో నలుగురికి విముక్తి కల్పించింది. ఇదే కేసులో ఇంకో ఐదుగురికి ఏడేళ్ల చొప్పున కారాగార శిక్ష విధించింది. గతేడాది ఆగస్టులో జస్టిస్ హర్ష దేవానీ, జస్టిస్ ఏఎస్ సుపెహియాలతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ ముగించి, తీర్పును వాయిదా వేసింది. 2012లో సిట్ కేసులపై విచారించిన ప్రత్యేక కోర్టు మొత్తం 23 మందికి జీవిత ఖైదు విధించింది. దోషులుగా తేలిన వారిలో బీజేపీ మాజీ మంత్రి మాయా కొడ్నానీకి 28 ఏళ్ల జైలు శిక్ష విధించగా.. భజరంగ్ దళ్ నేత బాబూ భజరంగీకి చనిపోయే వరకు జీవిత ఖైదు విధించారు. వీరితో పాటు మరో ఏడుగురికి 21 ఏళ్ల పాటు జీవిత ఖైదు విధించగా... మిగతా వారికి 14 ఏళ్ల జైలు శిక్ష విధించారు. కాగా ప్రత్యేక కోర్టు తీర్పుపై వీరంతా హైకోర్టును ఆశ్రయించారు.