విహారయాత్రలో అపశ్రుతి..

SMTV Desk 2018-05-11 12:33:26  boat fire accident in west godavari, papi kondalu boat fire accident, west godavari, devipatnam

దేవీపట్నం, మే 11: పాపికొండలు విహారయాత్ర కోసం వెళ్లిన ఓ పడవలో అగ్ని ప్రమాదం సంభవించింది. సుమారు 80 మంది ఉన్న పడవలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయందోళనకు లోనయ్యారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం వీరవరపులంక వద్ద శుక్రవారం ఉదయం పడవలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. పోశమ్మగుడి నుంచి బయల్దేరిన 10 నిమిషాలకే ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటన గురించి తెలుసుకున్న వీరవరపులంక వాసులు హుటాహుటిన నదిలో ఈదుకుంటూ వెళ్లి 40 మంది ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. సమాచారమందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకొని స్థానికుల సాయంతో మిగతావారిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. మంటల ప్రభావానికి పడవ పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. అనంతరం ప్రయాణికులను అక్కడి నుంచి తరలించి వైద్య సేవలు అందించారు. పడవలో గ్యాస్‌ పొయ్యిపై టీ కాస్తుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.