కరీంనగర్, మే 10: ఎన్ని అడ్డంకులు ఎదురైనా కోటి ఎకరాలకు సాగునీరివ్వడమే తమ లక్ష్యమని, వ్యవసాయం దండగ కాదు.. పండగ అని నిరూపిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. పథకాలు విజయవంతం చేయడానికి ఉద్యోగులు కష్టపడుతున్నారని ప్రశంసించారు. అగ్రకులాల పేదల సంక్షేమానికి కృషి చేస్తున్నామని.. వారికోసం పథకాలు ప్రారంభిస్తామని చెప్పారు. రాజకీయ స్వార్థం కోసం విపక్ష నేతలు అవాకులు, చెవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సబ్సిడీ గొర్రెల పథకం విజయవంతమైందన్నారు. సబ్సిడీ గొర్రెల వల్ల యాదవులు ఇప్పటికే రూ.1000 కోట్లు సంపాదించారని చెప్పారు. మత్స్యకారులకు మరబోట్లు, వలలు ఇస్తామన్నారు. కేసీఆర్ కిట్ల ద్వారా ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయని తెలిపారు. తెలంగాణ సాధించిన పార్టీ టీఆర్ఎస్సేనని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణను వేధించిన పార్టీ మాత్రం కాంగ్రెస్ అని ఆరోపించారు.