అమరావతి, మే 9: వైకాపా ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యల పై మంత్రి ఆదినారాయణరెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై రోజా చేస్తున్న అభియోగాలు సరికాదని అన్నారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. రాజకీయాలలో జబర్దస్త్ లాంటి కార్యక్రమాలు నడవవని ఎద్దేవా చేశారు. ఒకవైపు సీబీఐని తప్పు పడుతున్న వైకాపా నేతలు... చంద్రబాబుపై అదే సంస్థతో విచారణ జరపాలంటూ ఎలా డిమాండ్ చేస్తారని ప్రశ్నించారు. అసలు వారు సీబీఐని మీరు నమ్ముతారా? లేదా? అన్నదానిపై స్పష్టత ఇవ్వాలన్నారు. తండ్రి సమానమైన వ్యక్తిపై నీచమైన వ్యాఖ్యలు చేయడం దారుణమని అన్నారు. ప్రజల కోసం కష్టపడుతున్న వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. జగన్ చెప్పేవన్నీ అబద్దాలేనని.. త్వరలో ఆయన జైలుకెళ్లడం ఖాయమని అన్నారు. రోజా రాజకీయాలు వదిలి సినిమాలు, సీరియళ్లకు పరిమితం కావాలని మంత్రి సూచించారు.