ఏపీ టెట్‌ నోటిఫికేషన్ విడుదల

SMTV Desk 2018-05-05 15:29:28  Ap. government, released, tet notification

అమరావతి, మే 5: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) నోటిఫికేషన్‌ను ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. ఈసారి టెట్‌లో కొత్తగా వ్యాయామ ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా పేపర్‌-2(బీ)ని ప్రవేశపెట్టారు. గతంలో టెట్‌ను మూడుపేపర్లుగా నిర్వహించగా ఈసారి రెండు పేపర్లకే పరిమితం చేశారు. కానీ, పేపర్‌-2ను ఏ, బీగా విభజించారు. పేపర్‌-1ను ఎస్జీటీలకు, పేపర్‌-2(ఏ)ను గణితం, సామాన్య, సాంఘిక శాస్త్రం, భాషా పండితులకు, పేపర్‌-2(బీ)ని వ్యాయామ ఉపాధ్యాయుల కోసం నిర్వహిస్తారు. అభ్యర్థులు ఒక్కసారి దరఖాస్తును పూర్తి చేసి, ఆన్‌లైన్‌లో సమర్పిస్తే ఎలాంటి మార్పులకు అవకాశం ఉండదని పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఒకవేళ అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తులో తప్పుగా నమోదు చేస్తే మరోసారి కొత్తగా దరఖాస్తు చేయాల్సి ఉంటుందని వెల్లడించింది. ఇందుకు అదనంగా మరో రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. అన్ని ప్రవేశ పరీక్షల్లోనూ దరఖాస్తుల్లోని తప్పులను సరి చేసుకోవడానికి అవకాశం ఇస్తుండగా.. పాఠశాల విద్యాశాఖ మాత్రం ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చింది.