వాషింగ్టన్, మే 4 : అగ్రరాజ్యం అమెరికా చైనాను తీవ్రంగా హెచ్చరించింది. దక్షిణ చైనా సముద్రంలో చైనా తమ సైన్యం మోహరించడం పట్ల అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. వివాదాస్పద ప్రాంతాల్లో డ్రాగన్ దేశం సైన్యాన్ని నియమిస్తే తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా తెలిపింది. దక్షిణ చైనా సముద్రంలో చైనా సైన్యం గురించి అన్ని విషయాలు తమకు తెలుసని వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ సారా శాండర్స్ అన్నారు. ఈ విషయం గురించి నేరుగా చైనా అధికారులతో చర్చిస్తామని అన్నారు. దీనిపై చైనా తక్షణమే, భవిష్యత్తులోనూ తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. దక్షిణ చైనా సముద్రం వియత్నాం, ఫిలిప్పైన్స్, చైనాతో పాటు మరికొన్ని దేశాల మధ్య ఉంది. ఇందులోని ద్వీపాలపై ఎన్నో వివాదాలు ఉన్నాయి. ఇందులోని చాలా ద్వీపాలను చైనా స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే వివాదాస్పద ప్రాంతంలో సైన్యాన్ని మోహరించుకునే హక్కు తమకు ఉందని చైనా చెబుతోంది. అయితే, అమెరికాతో పాటు పలు దేశాలు చైనా తీరును వ్యతిరేకిస్తున్నాయి.