హైదరాబాద్,మే 2 : భార్య సంపాదిస్తే ఇంట్లో కూర్చునే తినే భర్తలకు హెచ్చరిక. సంపాదించే భార్య వల్ల భర్త ఆరోగ్యానికి ప్రమాదమని తాజా అధ్యయనంలో తేలింది. సదరు భర్తలు హృద్రోగం, మధుమేహం, పక్షవాతం తదితర వ్యాధుల బారిన పడే ప్రమాదముందని అమెరికాలోని రెట్గర్స్ విశ్వవిద్యాలయం పరిశోధనలో తేలింది. చాలా మంది పురుషులు కుటుంబానికి ఎప్పటికీ తామే ఆధారంగా నిలవాలని, స్త్రీలు తమపై ఆధారపడాలని కోరుకుంటారని, ఒకవేళ పరిస్థితి తల్లకిందులైతే మాత్రం తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతారని ఆధ్యయనకారులు పేర్కొన్నారు. అది వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నారు. దాదాపు 30 ఏళ్లుగా రెండు వేల జంటలను పరిశీలించి వారు ఈ విషయాన్ని వెల్లడించారు. ఆర్థికంగా స్త్రీల మీద ఆధారపడిన భర్తలు.. ఆందోళన కారణంగా హృద్రోగాలు, మధుమేహం, పక్షవాతం, కాలేయ సమస్యలు వంటి వ్యాధులకు గురైనట్టు తమ పరిశీలనలో తేలిందన్నారు. ఇప్పటికీ పురుషుల ఆలోచనా విధానంలో మార్పు రాలేదని వారు పేర్కొన్నారు.