న్యూఢిల్లీ, మే 1: ఆధార్ కార్డు.. ప్రస్తుతం కేంద్రప్రభుత్వం పెట్టిన పథకాలు దక్కాలన్న, బ్యాంకు ఖాతా, సిమ్ కోసమైనా ఇలా అన్ని రకాల పనులకు ఆధారంగా మారింది. ఆధార్ కార్డును ప్రతి ఒక్క అవసరానికి తప్పనిసరి చేయడంపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతోన్న సంగతి తెలిసిందే. దీంతో ఆధార్ కార్డు తప్పనిసరిపై సుప్రీంకోర్టులో వాదనలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మొబైల్ సిమ్ పొందడానికి ఆధార్ కార్డు అవసరం లేదని కేంద్రం తేల్చిచెప్పింది. ఈ విషయంపై కేంద్రం టెలికాం కంపెనీలకు ఆదేశాలు జారీచేసింది. ప్రత్యామ్నాయ డాక్యుమెంట్లు డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, ఓటర్ ఐడీ కార్డు వంటి డాక్యుమెంట్లతో సిమ్ కార్డును ఇవ్వాలని టెలికాం కంపెనీలను కేంద్రం ఆదేశించింది. వినియోగదారులకు అసౌకర్యం కలిగించకుండా వెంటనే ఈ ఆదేశాలను అమలు చేయాలని టెలికాం సెక్రటరీ అరుణ్ సుందరరాజన్ వెల్లడించారు.