ములుగు, మే 1: సిద్దిపేట జిల్లా ములుగు మండలం తున్కిబొల్లారంలో కొండపోచమ్మ జలాశయం ముంపు బాధితులకు నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇళ్ల పనులను మంత్రి హరీశ్రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు సాగు నీరంది౦చాలనే లక్ష్యంతో కొండపోచమ్మ జలాశయ నిర్మాణం చేపడుతుంటే తెఐకాస కుట్రలో భాగంగా దొడ్డిదారిన వచ్చి పనులను అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయమని, మేధావి అయిన కోదండరాంకు ఇది తగునా అంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్పై ప్రజలు విశ్వాసంతో ఉన్నారని, తెజస అధ్యక్షుడు కోదండరాం మాటలను ప్రజలు నమ్మరని హరీశ్రావు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఐఏవై ఇళ్లు 125 గజాల స్థలంలో రూ. లక్ష రుణ సదుపాయంతో చేసేవారని, తెరాస ప్రభుత్వం నిర్వాసితుల కోసం అన్ని సౌకర్యాలతో ఆదర్శవంతమైన కాలనీ నిర్మాణం చేపట్టామన్నారు.