కథువా కేసుపై సుప్రీంకోర్టు స్టే

SMTV Desk 2018-04-27 15:37:01  kathua case, supreme court stay, kathua case stay, deepak mishra

న్యూఢిల్లీ. ఏప్రిల్ 27 : జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో కథువాలోని 8ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ కేసులో మే 7 వరకు ఎలాంటి దర్యాప్తు చేపట్టరాదని ఆదేశాలు జారీ చేసింది.ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలో జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఇందు మల్హోత్రాలతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. ఈ కేసులో బాధితురాలి తండ్రి అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకునే అవకాశాలున్నాయని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. దీనిపై తదుపరి విచారణను మే 7కు వాయిదా వేసింది. అప్పటి దాకా ఎలాంటి విచారణ చేపట్టరాదని స్పష్టం చేసింది. కేసు విచారణను చండీగఢ్‌కు బదిలీ చేయాలని, సీబీఐకి అప్పగించాలని పిటిషన్లు వస్తున్న నేపథ్యంలో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లాకు చెందిన ఎనిమిదేళ్ల బాలికపై ఈ ఏడాది జనవరిలో సామూహిక అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. అనంతరం ఆమెను అత్యంత కిరాతంగా చంపేశారు. గత నెలలో ఈ దారుణం వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.