కూతురికి ఉరేసి తల్లి ఆత్మహత్య

SMTV Desk 2018-04-26 13:23:56  Suicide guntur Crime News Swapna

గుంటూరు, ఏప్రిల్ 26: స్థానిక పట్టాభిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చంద్రమౌళినగర్‌లోని పెట్రోల్‌ బంక్‌ ఎదురుగా ఉన్న వికాస్‌ ఎన్‌క్లేవ్‌ అపార్టుమెంట్‌లో బండ్లమూడి స్వప్న(28), కుమార్తె కీర్తిక(4) సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుమార్తెను చంపి, ఆపై తల్లి కూడా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చంద్రమౌళినగర్‌ వికాస్‌ ఎన్‌క్లేవ్‌లో బండ్లమూడి శ్రీనివాసరావు, భార్య స్వప్న (28), కుమార్తె కీర్తిక (5) నివాసం ఉంటున్నారు. తాడేపల్లి మండలం పెనుమాకకు చెందిన శ్రీనివాసరావుకు నీరుకొండకు చెందిన స్వప్నతో 2012లో వివాహమైంది. హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేసే శ్రీనివాసరావు స్వప్నతో కలిసి రెండున్నరేళ్ల పాటు అక్కడే ఉన్నాడు. వారికి కుమార్తె కీర్తిక అక్కడే జన్మించింది. మూడున్నరేళ్ల క్రితం గుంటూరుకు వచ్చి విద్యానగర్‌లోనే ఉంటున్నారు. కొద్దికాలం క్రితమే వికాస్‌ ఎన్‌క్లేవ్స్‌కు వచ్చి ఉంటున్నారు. హైదరాబాద్‌ నుంచి వచ్చిన తరువాత శ్రీనివాసరావు పని ఏమీ చేయకుండా ఖాళీగా ఉంటున్నాడు. దీనికి తోడు శ్రీనివాసరావుకు నరాలకు సంబంధించిన వ్యాధి ఉన్నట్టు బంధువులు తెలిపారు. కుమార్తె కీర్తికకు కూడా వ్యాధి సోకింది. కీర్తిక కంటి పక్కన ఎముకకు సంబంధించిన ఆపరేషన్‌ చేయించగా, అది ఫెయిలవడం, తిరిగి పదేళ్ల తర్వాత చేయాలని వైద్యులు చెప్పినట్టు బంధువులు తెలిపారు. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన స్వప్న మంగళవారం రాత్రి భర్త శ్రీనివాసరావు బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో హ్యాంగర్‌కు కీర్తికకు ఉరి వేసి చంపి, ఆమె కూడా పక్క గదిలోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.