హూస్టన్, ఏప్రిల్ 24 : అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. 93ఏళ్ల జార్జ్ బుష్ హూస్టన్లోని మెథడిస్ట్ ఆస్పత్రిలో చేరినట్లు కుటుంబ అధికార ప్రతినిధి జిమ్ మెక్గ్రాత్ ఓ ప్రకటనలో తెలిపారు . ఆయనకు ఇన్ఫెక్షన్ సోకిందని, అది రక్తంలోకి కూడా వ్యాపించిందని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని జిమ్ వెల్లడించారు. బుష్ సతీమణి బార్బరా బుష్ అంత్యక్రియలు జరిగిన మరుసటి రోజే ఆయన ఆస్పత్రిలో చేరినట్లు ఆయన చెప్పారు. బార్బరా బుష్ గత మంగళవారం మరణించగా శనివారం అంత్యక్రియలు జరిగాయి. బుష్, బార్బరా బుష్ 73ఏళ్ల వైవాహక జీవితాన్ని గడిపారు. శుక్రవారం బార్బరా భౌతిక కాయం సందర్శనకు వచ్చిన వారితో బుష్ పలకరిస్తూ కనిపించారు. అలాగే శనివారం కూడా ఆయన సందర్శనకు వచ్చిన ప్రముఖులకు రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అమెరికాకు 41వ అధ్యక్షుడిగా పనిచేసిన బుష్ 1924లో జన్మించారు. 1989 జనవరి నుంచి 1993 జనవరి వరకు అధ్యక్షుడిగా పనిచేశారు. బుష్ కుమారుడు జార్ట్ డబ్ల్యు బుష్ అమెరికాకు 43వ అధ్యక్షుడిగా పనిచేశారు.