రాజమండ్రి, ఏప్రిల్ 24: బాలికపై అత్యాచారం కేసులో పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఒకటో అదనపు జిల్లా సెషన్ కోర్టు తీర్పు ఇచ్చింది. చింతూరు ఎస్సై శ్రీనివాస కుమార్ కథనం ప్రకారం.. 2015 నవంబర్ 28న చింతూరుకు చెందిన తిలపురెడ్డి సాయి మణికంఠ, చింతూరు జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. అదే కాలేజీలో చదువుతున్న బాలికను కాలేజీ వెనుకకు తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. బాలికను వివాహం చేసుకోమంటే కులం తక్కువ అని నిరాకరించాడు. ఈ సంఘటన పై అప్పటి చింతూరు ఎస్సై గజేంద్ర కుమార్ కేసు నమోదు చేసి, రాజమండ్రి ఒకటో అదనపు జిల్లా సెషన్ కోర్టుకు విచారణ నిమిత్తం పంపారు. కేసును విచారణ చేసిన ఒకటో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి కిషోర్ కుమార్ తీర్పు ఇస్తూ నిందితుడిపై నేరం రుజువు కావడంతో పదేళ్ల జైలుశిక్షతో పాటు రూ.1000 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.