అమరావతి, ఏప్రిల్ 24: ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై కేంద్ర ప్రభుత్వ వివక్షను నిరసిస్తూ ఐదుకోట్ల మంది రాష్ట్ర ప్రజలు మంగళవారం రాత్రి 7 గంటల నుంచి 7.30 వరకు అరగంట సేపు లైట్లు తీసివేసి బ్లాక్డేగా పాటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. ఏపీకి పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను, చేసిన చట్టాలను అమలు చేయాలని 4 ఏళ్లుగా కోరుతున్నా ఈ ప్రభుత్వాలు పట్టించుకోనందుకు నిరసనగా బ్లాక్ డేకు పిలుపునిచ్చినట్టు తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఇబ్బడి ముబ్బడిగా నిధులు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం ఏపీ పట్ల నియంతలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.