హైదరాబాద్, ఏప్రిల్ 24 : అలనాటి అందాల తార, అగ్ర కథానాయిక, తన నటనతో మంత్రముగ్దుల్ని చేసిన మేటి నటి సావిత్రి.. జీవిత కథ ఆధారంగా "మహానటి" చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి నాగ అశ్విన్ దర్శకత్వం వహించగా.. కీర్తిసురేష్ సావిత్రి పాత్రను పోషిస్తున్నారు. సమ౦త, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మోహన్ బాబు, శాలినీ పాండే, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అయితే సావిత్రి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను విజయ్ దేవరకొండ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. సావిత్రిని ఉద్దేశిస్తూ.. "సావిత్రి.. ఎంత అందంగా ఉంటారో. ఆమె నిర్భయంగా ఉంటూ సమాజానికి ఎంతో మంచి చేశారు. వీటన్నింటికీ మించి ఆమె కూడా ఒక ఆడదే. ప్రతి ఒక్కరినీ ప్రేమించే మనస్తత్వం. ప్రేమించాలనుకున్నారు, ప్రేమించబడాలనుకున్నారు. ఆ తర్వాతే సూపర్స్టార్ అవ్వాలని కలలు కన్నారు. సావిత్రి సంసారాలు కూల్చారాని, తాగుబోతని తిట్టిన వారంతా నా వద్దకు రండి. మీరందరికీ ఆడియో లాంచ్ పాస్లు ఇస్తాను. ఒకప్పుడు తనని ఎన్నో మాటలు అన్న మీలాంటి విమర్శకులు రావడం చూసి సావిత్రి కొంతైనా సంతోషిస్తారు" అని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.