న్యూఢిల్లీ, ఏప్రిల్ 23 : కాంగ్రెస్ పార్టీ సహా ఏడూ పార్టీలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై పెట్టిన అభిశంసన నోటీసును ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు తిరస్కరించారు. ఈ విషయంలో న్యాయకోవిధుల అభిప్రాయం తీసుకున్న తర్వాత వెంకయ్యనాయుడు ఈ నిర్ణయాన్నివెల్లడించారు. సీజేఐ దీపక్ మిశ్రా ఉద్వాసన పలకాలంటూ గత శుక్రవారం కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడుకు నోటీసు అందించిన విషయం తెలిసిందే. సీజేఐ దీపక్ మిశ్రాపై అభిశంసన కోరుతూ 64 మంది ఎంపీలు సంతకాలు చేసిన నోటీసులు గత వారం ఉప రాష్ట్రపతి వద్దకు చేరాయి. అభిశంసన నోటీసుపై కాంగ్రెస్, ఎన్సీపీ, సీపీఎం, సీపీఐ, ఎస్పీ, బీఎస్పీ, ముస్లిం లీగ్ సభ్యులు సంతకాలు చేశారు.