చిట్యాల, జూలై 5 : సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రానున్న ఎలక్షన్లలో గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటి చేసి సీఎం కేసీఆర్ ను ఓడిస్తానన్నారు. నల్గొండ జిల్లా చిట్యాల, కనకల్ మండలంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన కేసీఆర్ కు సవాల్ విసిరారు. కేసీఆర్ కు దమ్ముంటే తనపై పోటి చేసి గెలవాలని ఎద్దేవా చేసారు. తెలంగాణా ప్రభుత్వం బోగస్ సర్వేలతో ప్రజలందరినీ మభ్యపెడుతుందని మండిపడ్డారు. సూర్యాపేట, నకిరేకల్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కు కనీస డిపాజిట్లు కూడా రావని, ఎక్కడో అడవులనుంచి వచ్చిన ఎమ్మెల్యే మళ్ళీ అక్కడికే వెళ్ళే సమయం దగ్గరలోనే ఉందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేఖ పాలనకు వ్యతిరేఖంగా త్వరలో తానూ దండయాత్ర, జైత్రయాత్రల పేరిట పాదయాత్ర చేయబోతున్నట్లు ఆయన వెల్లడించారు.