హైదరాబాద్, ఏప్రిల్ 20 : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై నటి శ్రీరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై అల్లు అరవింద్, నాగబాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ్ స్పందించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయంపై పవన్ కళ్యాణ్ భావోద్వేగంతో ట్విటర్ ద్వారా స్పందించారు. టీఆర్పీలు, రాజకీయ లాభాల కోసం నా తల్లిని దూషిస్తున్నారు. నేను ఒక నటుడిగా కంటే ముందు ఒక తల్లికి బిడ్డను. ఆమె గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత నాపై ఉంది. ఒక కొడుకుగా ఆమె గౌరవాన్ని కాపాడుకోలేకపోతే బతకడం కంటే చావడం మంచిద౦టూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికి ఉపకారం తప్ప అపకారం చెయ్యని నా జన్మనిచ్చిన తల్లిని మీరందరు కలిసి నడిరోడ్డులో ఏ కొడుకు కూడా వినకూడని ఒక తప్పుడు పదాన్ని అనిపించారు. అంతేకాకుండా ఆ పదాన్ని పదే పదే డిబేట్లు పెట్టి వినిపించారు. మీరంతా కలిసి సమాజంపై ఇన్ని అత్యాచారాలు చేస్తున్నా.. మీకు అండగా నిలబడ్డ మీ తల్లిదండ్రులకి, మీ అక్కచెల్లెళ్లకు, మీ కూతురులకి, కోడళ్ళకి మీ ఇంటిల్లిపాదికి నా హృదయపూర్వక వందనాలు. అంటూ పవన్ ట్వీట్ చేశారు.