ఆ దీవి.. ఖనిజాల నిధి

SMTV Desk 2018-04-19 18:06:31   Minamitori Island, japan island, pacific ocean, tokyo

టోక్యో, ఏప్రిల్ 19 : మినామిటోరీ.. పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఒక చిన్న దీవి..! జపాన్ రాజధాని టోక్యో నుండి 1200 కిలోమీటర్ల దూరాన నడిసంద్రంలో ఉంది. బురద పేరుకు పోయి పర్యాటక రంగానికి కూడా పనికి రాకుండా పోయిన ఆ దీవి.. ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే శాసించేదిగా మారింది. జపాన్‌ తలరాతను మార్చేసే వార్తలను జపనీస్‌ పరిశోధక బృందం ఒకటి వెలుగులోకి తెచ్చింది. ఇట్రియం, యూరోపియం, టెర్బియం, డిస్‌ప్రోజియం.. ఇలా అరుదైన ఖనిజాలను కనుగొంది. వీటిని స్మార్ట్‌ఫోన్స్, మిస్సైల్ వ్యవస్థలు, రాడార్ పరికరాలు, హైబ్రిడ్ వాహనాల తయారీలో వాడుతారు. ఇట్రియంను కెమెరా లెన్స్‌లు, సూపర్ కండక్టర్స్, సెల్‌ఫోన్ స్క్రీన్ల తయారీలో వాడుతారు. ఈ దీవి జపాన్ సరిహద్దులోనే ఉందని.. దానిపై పూర్తి హక్కులు తమకే ఉన్నాయని టోక్యో వర్గాలు ప్రకటించుకున్నాయి. ఇప్పటికే ఇట్రియం అనే అరుదైన ఖనిజాన్ని ఈ బురదలో నుంచి వెలికి తీయగా.. సమీప భవిష్యత్‌లో మిగతా ఖనిజాల వెలికితీత ప్రారంభం కానుంది. ఇట్రియంను కెమెరా లెన్స్‌లు, సూపర్ కండక్టర్స్, సెల్‌ఫోన్ స్క్రీన్ల తయారీలో వాడుతారు. అరుదైన భూఖనిజాల విషయంలో ప్రపంచమంతా చైనాపైనే ఆధారపడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో జపాన్‌ గనుక ఈ ఖనిజాల ఉత్పత్తిని కొనసాగిస్తే మాత్రం ఏడాది తిరగకుండానే చైనాను మించి పోవటం ఖాయమని ఆర్థిక వేత్తలు విశ్లేషిస్తున్నారు.