అమరావతి, ఏప్రిల్ 19 : దేశవ్యాప్తంగా బ్యాంకులలో, ఏటీఎంలలో నగదు కొరత ఉందని.. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.రఘువీరారెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈనెల 21న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బ్యాంకులు, ఏటీఎంల వద్ద నిరసన తెలపాలని కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. ఏటీఎంలలో నగదు లేక ప్రజలు నానా ఇబ్బందులను పడుతుంటే ఈ బాధ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కనిపించడం లేదా.? ప్రజలు ఇంత ఇబ్బందులను ఎదుర్కొంటు౦డగా.. ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు ఏంటి.? ఆనాడు పెద్ద నోట్ల రద్దును స్వాగతించిన చంద్రబాబు.. పరిష్కార కమిటీ అధ్యక్షుడిగా ఉన్న విషయం మర్చిపోయారా.? అంటూ ఆగ్రహించారు. ముఖ్యమంత్రి త్వరితగతిన చర్యలు చేపట్టి ప్రజా సమస్యలను పరిష్కరించాలని సూచించారు.