నేలకొండపల్లి, ఖమ్మం జూలై 4 : తెలంగాణ రాష్ట్రం.. బంగారు రాష్ట్రం.. ఇలాంటి రాష్ట్రంలో పేకాట అనే ప్రస్తావనే వినిపించకూడదు....అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గతంలో పోలీసులకు ఈ విషయంపై గట్టి ఆదేశాలు చేశారు. ఏం తమాషాగా ఉందా ... ఎవరైనా పేకాట క్లబ్ లను తెరిపించాలంటూ మరోసారి నా దగ్గరకు వస్తే, జైలు శిక్ష తప్పదని తన వద్దకు వచ్చిన వారికి సీఎం సీరియస్ గా ఇచ్చిన వార్నింగ్ ఇది.. పేకాట విషయంలో సీఎం కఠిన చర్యలు వారిపై తీసుకోవాలని చెపుతుంటే మరో వైపు ప్రభుత్వ అధికారులే పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కారు. ఇటీవల ఓ ఉన్నత అధికారి ఇద్దరు డీటీలు సహా ఐదుగురుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని చెర్వుమాధారం గ్రామానికి చెందిన ఆర్డీవో స్థాయి అధికారి భాస్కర్, మరో నలుగురు రెవెన్యూ అధికారులు అజయ్ తండా శివారులోని ఓ గెస్ట్ హౌస్ లో ఆదివారం రాత్రి వీకెండ్ పార్టీ చేసుకున్నారు. అక్కడ పేకాట ఆడుతున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే గెస్ట్ హౌస్ పై దాడి చేశారు. ఆ దాడిలో డిప్యూటీ తహసీల్దార్లు రాళ్లబండి రాంబాబు, వనం కృష్ణప్రసాద్, రెవెన్యూ ఇన్ స్పెక్టర్ కల్లూరి కిరణ్ కుమార్, సముద్రాల శ్రీనివాస్ లతో పాటు భాస్కర్ ను అరెస్ట్ చేశారు. ఈ మేరకు కేసు పెట్టి విడుదల చేశారు. వీరిని కోర్టుకు హాజరు కావాలని నోటీసులు జారీ చేయడంతో వారి నుంచి రూ. 44,420 నగదును స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో పేకాట అడేవారి పైన కఠిన చర్యలు తప్పవని పోలీస్ అధికారులు వెల్లడించారు.