న్యూఢిల్లీ, ఏప్రిల్ 18 : జమ్ముకశ్మీర్లోని కథువాలో ఇటీవల 8ఏళ్ళ బాలికపై అత్యంత దారుణంగా అత్యాచార౦, హత్య కేసు విషయంలో పలు మీడియా ఛానళ్లపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యాచారానికి గురైన ఎనిమిదేళ్ల బాలిక పేరు, ఫొటో, ఇతర వివరాలను పలు మీడియా సంస్థలు బయటపెట్టడాన్ని తీవ్రంగా ఖండించింది. అంతేకాదు సదరు మీడియా సంస్థలపై రూ.10 లక్షల జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని బాధితురాలి పరిహార నిధికి పంపించాలని కోర్టు ఆదేశించింది. చట్ట ప్రకారం.. అత్యాచారానికి గురైన బాధితురాలి పేరును ఎట్టిపరిస్థితిలోనూ బయటపెట్టకూడదు. అలా చేస్తే.. ఆర్నెల్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశముందని కోర్టు తెలిపింది. అయినా నిబంధనలకు విరుద్దంగా బాలిక పేరు, ఫొటో వివరాలను పలు పత్రికలు, ఛానళ్లు వెల్లడించాయి. దీన్ని కోర్టు తీవ్రంగా ఖండిస్తూ... విచారణను ఏప్రిల్ 25కు వాయిదా వేసింది.