కోల్కతా, ఏప్రిల్ 17 : ఐపీఎల్ లో భాగంగా సొంతగడ్డపై కోల్కతా నైట్ రైడర్స్( కేకేఆర్) జట్టు ఢిల్లీ డేర్ డెవిల్స్ పై విరుచుకుపడింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ తో అద్వితీయమైన ప్రదర్శన చేసిన కార్తీక్ సేన రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. టాస్ నెగ్గిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. కోల్కతా బ్యాట్స్ మెన్ ల్లో నితీశ్ రాణా 59, రస్సెల్ (12 బంతుల్లో 41; 6 X6) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. భారీ ఛేదనలో ఢిల్లీ ఆదిలోనే తడబడింది. తొలి ఓవర్ ఐదో బంతికే రాయ్ (1) వికెట్ కోల్పోయిన డేర్ డెవిల్స్ జట్టు.. ఆ తర్వాత కెప్టెన్ గంభీర్ (8), శ్రేయస్ అయ్యర్ (4) వికెట్లు చేజార్చుకుని 24/3తో కష్టాల్లో పడింది. ఈ స్థితిలో రిషబ్ పంత్ (43), మాక్స్వెల్ (47) రాణించినప్పటకి .. మిగతా 9 మంది బ్యాట్స్ మెన్లు సింగల్ డిజిట్ కే పరిమితమయ్యారు. కేకేఆర్ బౌలర్ల ధాటికి ప్రత్యర్ధి జట్టు 14.2 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూలింది. మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు నితీష్ రాణా కు దక్కింది.